తోటపల్లి గూడూరు,ఏప్రిల్ 28: ఉద్యమ వార్త
నెల్లూరు జిల్లాలో చేపల కొనుగోలుదారుల సిండికేట్ వ్యవహారం రోజురోజుకు మరింత వివాదాస్పదంగా మారుతోంది. సిండికేట్కు నాయకత్వం వహిస్తున్న వ్యక్తి తన ప్రభావాన్ని విస్తరించేందుకు ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలతో కూడా సంబంధాలు పెంచుకుంటున్నాడని సమాచారం వెలుగులోకి వచ్చింది.ముఖ్యంగా తన కుమారుడి వివాహం విషయంలో పలువురు రాజకీయ నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నాడన్న వార్తలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.ఇక ఈ సిండికేట్ డాన్ ఎదుగుదలపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో సాధారణ స్థితిలో ఉన్న అతను, తక్కువ కాలంలోనే వేల కోట్ల ఆస్తులను ఎలా కూడబెట్టాడన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. చేపల మార్కెట్ను తన ఆధీనంలోకి తీసుకుని రైతులను ఆర్థికంగా దెబ్బతీస్తూ సంపాదించిన అక్రమ సంపాదనే ఈ ఆస్తుల వెనుక ఉందని రైతులు ఆరోపిస్తున్నారు.సిండికేట్ ప్రభావంతో రైతులు తమ చేపలను బలవంతంగా తక్కువ ధరలకు అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ధరలను కృత్రిమంగా నియంత్రిస్తూ భారీ లాభాలు ఆర్జిస్తున్నారని చెబుతున్నారు. కొంతమంది రైతులను భయభ్రాంతులకు గురిచేస్తూ బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో జిల్లాలో చేపల సాగు వ్యవస్థ సంక్షోభంలో పడింది.ఈ నేపథ్యంలో ఆ వ్యక్తిపై అక్రమ ఆస్తుల అంశంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు మరియు ప్రజలు జిల్లా ఉన్నతాధికారులను గట్టిగా కోరుతున్నారు. మార్కెట్లో పారదర్శకత తీసుకురావడంతో పాటు సిండికేట్ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలని, లేదంటే చేపల రైతుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు.




