udyamavaartha.in
Newspaper Banner
Date of Publish : 03 April 2026, 10:33 am Digital Edition : UDYAMA VAARTHA

సర్వేపల్లిలో ప్రజల అర్జీల వెల్లువ… సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేను ఆశ్రయించిన ప్రజలు.

తోటపల్లి గూడూరు, ఏప్రిల్ 3 ఉద్యమ వార్త

సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రజలు తమ సమస్యలకు పరిష్కారం కోసం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని ఆశ్రయించారు. నెల్లూరులోని వేదాయపాళెం కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ అర్జీలు సమర్పించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కారం పొందాలనే ఆశతో వచ్చారు.ఈ సందర్భంగా తోటపల్లి గూడూరు మండలంలోని కోవెరపాలెం గ్రామానికి చెందిన ముత్యాల శ్రీనివాసులు తమ గ్రామ సమస్యలను క్రమపద్ధతిలో ఎమ్మెల్యేకు వినిపించారు. గ్రామంలోని పంచాయతీ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారిందని, వెంటనే కొత్త భవనం నిర్మించాలని కోరారు. అలాగే కృష్ణారెడ్డి పాలెం మెయిన్ రోడ్ నుంచి కోవెరపాలెం వరకు సీసీ రోడ్డు వేయాలని, డ్రైనేజీ కాలువలు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.ఇంకా గ్రామంలోని అంగన్వాడీ భవనం స్లాబ్ దెబ్బతినడంతో వర్షాల సమయంలో నీరు లోపలికి చేరుతోందని, చిన్నారులకు ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు. గ్రామంలోని తారు రోడ్డు గుంతలతో దెబ్బతిన్నందున దానిని సీసీ రోడ్డుగా మార్చాలని కూడా అర్జీలో పేర్కొన్నారు. పంచాయతీ కార్యాలయం కూడా పూర్తిగా పాడైపోయిన నేపథ్యంలో అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు ఎమ్మెల్యేను వేడుకున్నారు.ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర మాట్లాడుతూ, ప్రజల నుంచి వచ్చిన ప్రతి అర్జీని ఆన్‌లైన్‌లో నమోదు చేసి సంబంధిత శాఖలకు పంపిస్తున్నామని తెలిపారు. ప్రతి సమస్యను పర్యవేక్షిస్తూ త్వరితగతిన పరిష్కారం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజలకు న్యాయం జరిగేలా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కట్టుబడి పనిచేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.ఈ ప్రజాదర్బార్ కార్యక్రమం ద్వారా ప్రజలు తమ సమస్యలను నేరుగా తెలియజేసుకునే వేదికగా మారి, సమస్యల పరిష్కారంపై ఆశలు పెంచింది.