udyamavaartha.in
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 8:17 am Digital Edition : UDYAMA VAARTHA

వాకాడు డిపోపై ‘కాగడా’ జెండా రెపరెపలాడాలి: నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ పిలుపు*

వాకాడు,ఉద్యమ వార్త;ఏప్రిల్ 14.

కార్మికుల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ (NMUA) వాకాడు డిపో సర్వసభ్య సమావేశం స్థానిక స్వర్ణముఖి గెస్ట్ హౌస్ వేదికగా అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ సమావేశానికి జిల్లా కార్యదర్శి మరియు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బి.ఎస్. బాబు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. కార్మికులకు ఏ కష్టం వచ్చినా, ఏ సమయంలోనైనా అండగా నిలబడే ఏకైక శక్తి నేషనల్ మజ్దూర్ అసోసియేషన్ అని ఆయన ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. జిల్లాలో గతంలో 1/19 సర్క్యులర్‌ను పకడ్బందీగా అమలు చేయించిన ఘనత తమ అసోసియేషన్ నని ఆయన గుర్తు చేశారు. ముఖ్యంగా వాకాడు డిపోలో కేఎంపీఎల్ (KMPL) పేరుతో కార్మికులపై ఒత్తిడి తెస్తున్న డిపో మేనేజర్ మొండి వైఖరిని బాబు తీవ్రంగా ఖండించారు. యాజమాన్యం తక్షణమే తన పద్ధతిని మార్చుకోవాలని, కార్మికుల ప్రయోజనాలకు భంగం కలిగించే చర్యలను సహించే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మక ‘స్త్రీ శక్తి’ పథకం అమలు నేపథ్యంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు లేకపోవడంతో అటు మహిళా ప్రయాణికులు, ఇటు కండక్టర్లు, డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే బస్టాండ్‌లలో మహిళా ప్రయాణికులకు అవసరమైన కనీస మౌలిక వసతులను యుద్ధ ప్రాతిపదికన కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.రాబోయే సిసిఎస్ (CCS) ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, వాకాడు డిపోలో అసోసియేషన్ జెండాను విజయవంతంగా ఎగురవేయాలని బి.ఎస్. బాబు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ లక్ష్య సాధన కోసం ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేస్తూ సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.జె. పెరుమాళ్, జోనల్ ప్రచార కార్యదర్శి రఘురామయ్య, జిల్లా అసిస్టెంట్ సెక్రటరీ ఆర్ముగం తమ ప్రసంగాల ద్వారా కార్మికులలో ఉత్తేజం నింపారు. డిపో చైర్మన్ శ్రీనివాసులు, డిపో అధ్యక్షలు ప్రశాంత్ కార్యదర్శి సంపత్, వర్కింగ్ ప్రెసిడెంట్ వంశీ, గ్యారేజ్ కార్యదర్శి శ్రీనివాసులు మరియు సీనియర్ నాయకుడు జార్జ్ తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో మహిళా కార్మికులు అసోసియేషన్ సభ్యులు భారీ సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.