తోటపల్లి గూడూరు, ఏప్రిల్ 28 (ఉద్యమ వార్త)
మండలంలోని వరకవిపూడి గ్రామంలో ఓ పెద్దా రెడ్డి వ్యవహారం వివాదాస్పదంగా మారింది. గ్రామస్తులు అతని మాట వినడం లేదన్న కారణంతో వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గ్రామ చెరువును తన స్వాధీనంలోకి తీసుకొని దళితులు, గిరిజనులను లక్ష్యంగా చేసుకుని ఒత్తిడి తెస్తున్నాడని స్థానికులు వాపోతున్నారు ఈ వ్యవహారాన్ని ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్లాలన్నా గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్న పరిస్థితి నెలకొంది. “ముందు కేసులు కొట్టేశారు అనుకోకండి… అవసరమైతే మళ్లీ కేసులు పెట్టి ఇరికిస్తాను” అంటూ బెదిరిస్తున్నాడని బాధితులు చెబుతున్నారు. దీంతో గ్రామంలో భయ వాతావరణం నెలకొంది.ఇప్పటివరకు సాధారణ ప్రజలు ఎలాంటి ప్రతిఘటనకు దిగకుండా గమ్ముగా ఉన్నప్పటికీ, ఈ పరిస్థితిపై అసంతృప్తి పెరుగుతోంది. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో అతనికి తగిన బుద్ధి చెబుతామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలోనే తమ నిరసన తెలియజేస్తామని వారు అంటున్నారు.అలాగే ముత్తుకూరు మండలం నుంచి వచ్చి తోటపల్లి గూడూరు మండలంలో పెత్తనం చెలాయిస్తున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. స్థానిక సమస్యల్లో అనవసర జోక్యం చేసుకోవడం, భయపెట్టే ధోరణి అవలంబించడం వల్ల గ్రామ శాంతి భద్రతలు దెబ్బతింటున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.