వాకాడు,ఉద్యమ వార్త;ఏప్రిల్ 9.
తిరుపతి జిల్లా వాకాడు మండలంలో ప్రతిష్టాత్మక దుగరాజపట్నం నౌకా నిర్మాణ కేంద్రం ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది. ఈ కేంద్రం స్థాపనలో భాగంగా జమీన్ కొత్తపాలెం పంచాయతీ పరిధిలో భూసేకరణ నిమిత్తం గురువారంఅధికారికంగా గ్రామసభను నిర్వహించారు. మండల తహసీల్దార్ (ఎమ్మార్వో) సయ్యద్ ఇక్బాల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి, జడ్పీటీసీ రౌతు రామకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ, నౌకా నిర్మాణ కేంద్రం ఏర్పాటును స్వాగతిస్తూనే స్థానిక ప్రజల ప్రయోజనాలే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా, ఒక గ్రామ స్థిర నివాసిగా బాధితుల పక్షాన నిలబడతానని ఆయన హామీ ఇచ్చారు. గతంలో బిజెఆర్, మాగుంట, ఎన్ఐఓటి వంటి ప్రైవేట్ సంస్థలు భూసేకరణ పేరుతో నిరుపేద ప్రజలను మభ్యపెట్టి భూములు తీసుకోవడం వల్ల నేడు వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రస్తుత ప్రాజెక్టు విషయంలో గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకూడదని, చుట్టుపక్కల ఉన్న పేదలకు ప్రభుత్వం నుండి అందాల్సిన పరిహారం, ఇతర ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందేలా అధికారులు బాధ్యతాయుతమైన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్, తుపిలిపాలెం పెద్దకాపు ఆర్కేటి మహేంద్ర, టీడీపీ నాయకులు వెంకటకృష్ణారెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ సయ్యద్ రఫీ, ఆర్ఐ అఖిల్ యాదవ్, మండల సర్వేయర్ గోపిరెడ్డి, రెవెన్యూ సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు. భూసేకరణపై తమ అభిప్రాయాలను వ్యక్తపరిచిన గ్రామస్థులు, ఈ సభను విజయవంతం చేశారు.